ప్రతిపక్షం, ఆగస్టు 14: త్వరలో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన ఓ యువ జంటను విధి ఊహించని విషాదంలోకి నెట్టింది. ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న ఈ కాబోయే భార్యాభర్తలు ఒకే బ్యాంకులో ఉద్యోగాలు చేస్తున్నారు. డిసెంబర్లో వివాహం చేసుకోవాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్న వేళ.. గంటల వ్యవధిలోనే ఇద్దరూ మృతి చెందడం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
కాసరగోడ్ జిల్లా పూచక్కాడ్కు చెందిన 25 ఏళ్ల పి. అనుశ్రీకి కన్నూర్ జిల్లా ఇరిట్టికి చెందిన 26 ఏళ్ల వి. అమల్తో ఇటీవల నిశ్చితార్థం జరిగింది. ఇద్దరూ ఒకే బ్యాంకులో ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ వేర్వేరు శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు. అనుశ్రీ కర్ణాటకలోని ఓ బ్యాంకు శాఖలో పనిచేస్తుండగా.. అమల్ కేరళలోని ఎర్నాకుళం శాఖలో పనిచేస్తున్నాడు.
ఇంట్లో విగతజీవిగా అనుశ్రీ
గురువారం కర్ణాటకలోని హున్సూర్లో ఉన్న తన నివాసంలో అనుశ్రీ విగతజీవిగా కనిపించింది. ఈ విషయాన్ని గుర్తించిన ఇంటి యజమాని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కాసరగోడ్లోని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అనుశ్రీ మృతికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
కొన్ని గంటల్లోనే అమల్ కూడా మృతి
కాబోయే భార్య అనుశ్రీ మరణించిన విషయం ఎర్నాకుళంలో ఉన్న అమల్కు తెలిసింది. ఈ విషయం తెలిసిన కొద్ది గంటల్లోనే అతడు కూడా ఓ హోటల్ గదిలో విగతజీవిగా కనిపించాడు. హోటల్ సిబ్బంది గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో అమల్ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు.
ఫోన్ వివరాలపై పోలీసుల ఆరా
అమల్ మరణానికి అసలు కారణమేంటనే విషయాన్ని తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అతడి మొబైల్ ఫోన్, కాల్ డేటా, ఇతర వివరాలను పరిశీలిస్తున్నారు. అనుశ్రీ మరణానికి, అమల్ మృతికి మధ్య ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది.
మరో మూడు నెలల్లో వివాహం చేసుకుని జీవితాన్ని ప్రారంభించాల్సిన ఇద్దరూ ఇలా గంటల వ్యవధిలో ప్రాణాలు కోల్పోవడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. అనుశ్రీ మరణాన్ని తట్టుకోలేక అమల్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. పూర్తి దర్యాప్తు అనంతరం మాత్రమే అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.





























