ప్రతిపక్షం, ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ సినీ ప్రముఖులు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదికగా సందేశాలు పంచుకున్నారు.
ప్రముఖ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగార్జున, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నందమూరి కల్యాణ్ రామ్ తదితరులు దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎందరో మహనీయులు చేసిన పోరాటాన్ని, తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చేసిన త్యాగాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
స్వేచ్ఛా భారతదేశం కోసం పోరాడిన సమరయోధుల స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలని, దేశ ఐక్యత, అభివృద్ధి కోసం కలిసి ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ హీరోలు చేసిన ఈ పోస్టులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సినీ తారల నుంచి వచ్చిన సందేశాలతో సామాజిక మాధ్యమాల్లోనూ దేశభక్తి భావం వెల్లివిరుస్తోంది.





























