ప్రతిపక్షం, ఆగస్టు 10: తెలంగాణలో గత నెల 16న ప్రారంభమైన బోనాల జాతర 25 రోజుల పాటు వైభవంగా కొనసాగి నిన్నటితో ముగిసింది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అమ్మవార్లకు భక్తులు బోనాలు సమర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల ముగింపు వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నేడు సెలవు ప్రకటించింది.
హైదరాబాద్ పాతబస్తీలోని లాల్దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంతో పాటు రాష్ట్రంలోని పలు అమ్మవారి ఆలయాల్లో నేడు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా అమ్మవారి ‘రంగం’ కార్యక్రమంలో భవిష్యవాణి వినిపించనుంది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.
బోనాల ముగింపు వేడుకల నేపథ్యంలో ఆలయాల వద్ద భారీగా భక్తుల రద్దీ ఉండే అవకాశం ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు కూడా అధికారులు చర్యలు చేపట్టారు.
మరోవైపు బోనాల జాతర సందర్భంగా నగరంలో నెలకొన్న పండుగ వాతావరణానికి నేటితో పూర్తిగా తెరపడనుంది. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, అమ్మవారి నామస్మరణలతో సాగిన ఈసారి బోనాల వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు ఎదురైన అనుభవాలను పలువురు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.





























